టేకులపల్లి: మండల పరిధిలోని టేకులపల్లి పంచాయతీ ఏ కాలనీ తండాకు చెందిన రైతు మంగళవా రం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. ఇంట్లోని ఫ్యాన్ పని చేయకపోవడంతో రైతు ధారావత్ తులిశ్యా (55) మరమ్మతులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం 108లో కొత్తగూడెం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఈఎంటీ రాధ, పైలట్ వెంకట రామారావు సీపీఆర్ చేశారు. కాగా, ఆస్పత్రి వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులుఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తిరుపతి తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
దుమ్ముగూడెం: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన వివాహిత పూనెం సంధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటప్పయ్య తెలిపిన వివరాలు.. సంధ్యకు 6 నెలల క్రితం సాయి అనే యువకుడితో వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల రోజులకు రోడ్డు ప్రమాదం జరగ్గా, సాయి మృతి చెందాడు. సంధ్యకు కాలు విరిగింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. భర్త చనిపోవడం, తాను గాయపడటంతో మనస్తాపం చెంది గత నెల 27న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డి మందు తాగి కూలీ..
అశ్వారావుపేటరూరల్: గడ్డి మందు తాగి ఓ కూలీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని పాత నారంవారిగూడేనికి చెందిన సత్తినపల్లి పెంటయ్య(53) కొద్ది కాలంగా అతిగా మద్యం తాగుతున్నాడు. సోమవారం రాత్రి కూడా మద్యం తాగడంతో కుటుంబీకులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


