కమీషన్ల కోసమేనా?
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ట్రాన్సిట్ ప్లాన్
రూ.600 కోట్లతో నగర
అభివృద్ధికి కౌన్సిల్ ఆమోదం
కమీషన్లు దండుకునేందుకేనని పలువురి ఆరోపణలు
గోప్యత పాటించడమేమిటని
కార్పొరేటర్ల ప్రశ్న
పారదర్శకత ఉండాలి
ఇంకా లేఖ రాలేదు
ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్–2026
కార్పొరేషన్ ఏర్పాడి ఏడాది దాటగా, గత ఫిబ్రవరిలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇప్పటివరకు నగరపాలక సంస్థ హోదాకు తగిన అభివృద్ధి పనులేమీ చేపట్టలేదు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ ఓరియెంటెండ్ డెవలప్మెంట్–2026 ప్రణాళికను పాలకవర్గం తెరమీదకు తెచ్చింది. ఇందుకోసం రూ.600 కోట్లు వెచ్చించనుండగా, రూ.300 కోట్లను రుణం రూపంలో ఓ విదేశీ బ్యాంకు/సంస్థ సమకూరుస్తుందని, మరో రూ.300 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచింగ్ గ్రాంట్గా వస్తాయని చెబుతున్నారు. కాగా, ట్రాన్సిట్ ప్లాన్ను గత జూన్ 6న కౌన్సిల్ ఆమోదించింది.
ఒక్కటే టెండర్
చేపట్టనున్న అభివృద్ధి పనుల డీపీఆర్ తయారీకి జూన్ 19న నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకే కంపెనీ టెండరు దాఖలు చేసింది. పోటీ లేనప్పుడు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ఆ కంపెనీతో కార్పొరేషన్ తరఫున చర్చలకు సన్నద్ధం అవుతుండటంతో ప్లాన్ రూపకల్పన, అమలుపై అనేక సందేహాలు వస్తున్నాయి.
సందేహాలు
చిన్న డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన జరిగితేనే వివరాలను ఘనంగా ప్రకటిస్తుంటారు. ఏకంగా రూ.600 కోట్లతో అమలు చేయబోయే ప్రణాళికపై గోప్యంగా వ్యవహరించమేంటని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు కౌన్సిల్లో ప్లాన్ ఆమోదం పొందిన రెండు వారాల వరకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, ఆ తర్వాత టెండర్ల దాఖలుకు కేవలం రెండే రోజుల సమయం ఇవ్వడమూ అనుమానాలకు తావిస్తోంది. డీపీఆర్ రూపకల్పన కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.50 శాతం వరకు వెచ్చించడం పరిపాటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే 1 శాతం/1.50 శాతం వరకు పెంచుతుంటారు. కార్పొరేషన్ పాలక వర్గం కేవలం డీపీఆర్ కోసమే 1.50 శాతం అంటే రూ.9 కోట్లను కేటాయించడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 కోట్లకు పెంచేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పద్దు కింద మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నాయి ? రుణం ఇచ్చేందుకు ఏ విదేశీ బ్యాంకు/సంస్థ ముందుకు వచ్చింది? తీసుకున్న రుణాన్ని ఎలా తీరుస్తారు? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికార, పాలకవర్గం నుంచి సమాధానం లేదు. దీంతో పక్కా ప్రణాళిక, పారదర్శకత పాటించకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చేపట్టిన ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్–2026 ప్రణాళికపై సందేహాలు ముసురుకుంటున్నాయి. అభివృద్ధి పేరుతో కమీషన్ల రూపంలో కాసులు రాబట్టుకునేందుకే ప్లాన్ రూపొందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ప్రక్రియ తీరు, డీపీఆర్కు అధిక కేటాయింపులు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ట్రాన్సిట్ ప్లాన్పై లేవనెత్తిన ప్రశ్నలకు పాలక, అధికార వర్గాల నుంచి సమాధానం కరువైంది. కొత్తగూడెం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణా న్ని తిరిగి ఎలా చెల్లిస్తారనే అనే అంశంపై స్పష్టత లేదు.
– కే. దుర్గాప్రసాద్, స్వతంత్ర కార్పొరేటర్
విదేశీ సంస్థ నుంచి నిధుల మంజూరు లేఖ ఇంకా రాలేదు. ఆ ఆర్డర్ రావడానికి ఐదు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల ప్లానింగ్కు సంబంధించి టెండర్ కూడా పిలవలేదు.
– సుజాత, కార్పొరేషన్ కమిషనర్,


