పకడ్బందీగా ‘స్వాతంత్య్ర’ ఏర్పాట్లు
కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. వాటర్ప్రూఫ్ టెంట్లు, వేదిక, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. శాఖలవారీగా ప్రగతి స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు.
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిశీలించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఉత్తమ వేదిక ప్రజావాణి కార్యక్రమమని అన్నారు. కాగా, ఈ వారం కూడా ప్రజా వాణికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గింది. వ్యవసాయ పనుల సమయం కావడంతో ఎక్కువ మంది రాలేదని అధికారులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు.
ప్రజావాణిలో స్వీకరించిన
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
తమ గ్రామంలో శిథిలావస్థకు పాఠశాల భవనంలో కొత్త భవనం నిర్మించాలని పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామపంచాయతీ కొత్తూరు గ్రామస్తులు విన్నవించారు. అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కోరగా, డీఈఓకు ఎండార్స్ చేశారు.
చేతి పంపునకు మరమ్మతులు చేపట్టాలని అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలోని కురుమబజార్ కాలనీ ప్రజలు విన్నవించగా, ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు.
సబ్ స్టేషన్ 132/33 కేవీ విద్యుత్లైన్ను గ్రామం మధ్యలో కాకుండా, శివారు నుంచి నిర్మించాలని అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని బాలాజీనగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ ఎస్ఈకి ఎండార్స్ చేశారు.
తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమిలో అధికారులు సర్వే నిర్వహించినా పట్టా మంజూరు కాలేదని గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన బొమ్మల లాలుప్రసాద్ వినతిపత్రం ఇచ్చాడు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు.
మార్క్ఫెడ్కు మొక్కజొన్న విక్రయించిన మొక్కజొన్న రైతుల ఖాతాలో పూర్తిస్థాయిలో నగదు జమ కాలేదని, పెట్టుబడుల అవసరాలు పెరిగిన దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందజేశారు.
ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధింపులకు గురి చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవా లని కోరుతూ పాల్వంచలోని గట్టాయిగూడేనికి చెందిన ఆర్.వీరయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.


