ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ముత్యాలంపాడు క్రాస్లో సబ్ స్టేషన్, రొంపేడులో సబ్స్టేషన్ పనులు ప్రారంభం
ఇల్లెందురూరల్/టేకులపల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని రొంపేడు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్లతో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత సబ్స్టేషన్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్రోడ్డులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం కోయగూడెంలో ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోవోల్జేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఎల్నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. తాగునీటి వనరుల పరిరక్షణ, వన్యప్రాణులకు నీటి లభ్యత, వ్యవసాయ రంగానికి అవసరమైన చర్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రొంపేడు, ముత్యాలంపాడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ఉపకేంద్రాలతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు, కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, సీఈ రాజు చౌహాన్, ఎస్ఈ మహేందర్, సర్పంచ్ భూక్య అనూష తదితరులు పాల్గొన్నారు.


