బూర్గంపాడు: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్లో ఆదివారం జిల్లా రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మోరంపల్లిబంజరలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను నిర్వహించారు. అనంతరం పినపాక పట్టీనగర్ నుంచి ఉప్పుసాక గ్రామానికి రూ 2.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అదనంగా సర్వేయర్లను, రోవర్ పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని చెప్పారు. అటవీ భూముల్లో కొత్తగా పోడుసాగు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో 4,500 ఇళ్లు, రెండో విడతలో 2 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార
శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


