కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఇటీవల ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే, సీఎం పర్యటన రద్దయిందని తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయకున్నా భారీ వర్ష సూచనతో సీఎం రేవంత్రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే, అంజనాపురంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారమే ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. వీరితో పాటు గోద్రెజ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీల్ కటారియా, ఆయిల్పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగీ హాజరవుతారని వెల్లడించారు. ఈమేరకు ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సుమారు వేయి మంది ఆయిల్పామ్ రైతులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం.
పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి


