భద్రాచలంఅర్బన్ : తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శిశువుకు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణం పోశారు. ఆళ్లపల్లి మండలం బూసురాయికి చెందిన మడకం శివ అనే నాలుగు నెలల బాలుడి కుడికాలు పూర్తిగా కాలిపోయి ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు సెప్పిస్, రక్తహీనత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు జనవరి 27వ తేదీన భద్రాచలం ఆస్పత్రికి తీసుకొచ్చారు. 2.8 కేజీల బరువుతో ఉన్న శివను పిల్లల వైద్యులు రాజశేఖర్ రెడ్డి, క్రాపా విజయ్తో పాటు ఎన్ఆర్సీ వార్డు వైద్యులు పూజ, సిబ్బంది 36 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుతూ మెరుగైన వైద్యం అందించారు. బరువు పెరిగేందుకు అవసరమైన ఆహార పదార్థాలు అందించారు. ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేశారు. దీంతో కాలు గాయం నయం కావడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడిన బాలుడిని మంగళవారం డిశ్చార్జ్ చేశారు. శిశువు ఆస్పత్రిలో చేరినప్పుడు 2.8 కేజీలు ఉండగా డిశ్చార్జ్ అయ్యే సమయానికి 4.25 కేజీలకు పెరగడం విశేషం. శిశువు పూర్తిగా కోలుకోవడానికి కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు.
36 రోజుల పాటు
కంటికి రెప్పలా కాపాడిన డాక్టర్లు


