తగ్గిన బొగ్గు ఉత్పత్తి
బఫర్ స్టాక్తో నడుస్తున్న ప్లాంట్లు
సరఫరాలో విఫలమవుతున్న సింగరేణి
వేసవితో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
బొగ్గు నిల్వలు పెంచాలని కోరాం
కేటీపీఎస్లో నిల్వ ఉన్న బొగ్గు
డేంజర్ బెల్స్!
2,880 మెగావాట్ల సామర్థ్యం
విద్యుత్ ఉత్పత్తిలో జిల్లాకు ఆది నుంచీ తెలంగాణలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (పాల్వంచ)లోని వివిధ యూనిట్ల నుంచి 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(మణుగూరు)లో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా జిల్లా నుంచి 2,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదవుతుండగా.. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలను వినియోగిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో గృహావసర విభాగంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. మరోవైపు రబీ సీజన్లో సాగువుతున్న వరి పొట్ట దశకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ మోటార్ల వినియోగం పెరగనుంది.
వేధిస్తున్న బొగ్గు కొరత
విద్యుత్ ఉత్పత్తి నిరంతరం కొనసాగేందుకు ప్రతీ కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా 15 రోజులకు తగ్గకుండా నిల్వలు ఉంచుతారు. కానీ ప్రస్తుతం కేటీపీఎస్, బీటీపీఎస్ల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. నాలుగైదు రోజులకు మించి ఇక్కడ నిల్వలు లేవని సమాచారం. కేటీపీఎస్లో వివిధ దశల్లో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లకు ప్రతీరోజు 22,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 21 రోజులకు అవసరమైన 4,72,500 మెగావాట్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉండాలి. కనీస స్థాయిలో 15 రోజులను పరిగణనలోకి తీసుకున్నా.. 3,37,500 టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ 80 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే నాలుగు రోజుల బఫర్ స్టాక్ ఉంది. బీటీపీఎస్లో కొంచెం మెరుగ్గా పదిరోజులకు అటుఇటుగా సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.
సింగరేణి నుంచి తగ్గిన సరఫరా
కేటీపీఎస్, బీటీపీఎస్లకు ప్రధానంగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా జరుగుతోంది. ఒప్పందం ప్రకారం బీటీపీఎస్కు ప్రతీ రోజు 18వేల టన్నులు, కేటీపీఎస్కు 22,500 టన్నుల బొగ్గు సింగరేణి నుంచి రావాల్సి ఉంది. కానీ కేటీపీఎస్కు సగటున 19 వేల టన్నుల బొగ్గే వస్తోంది. జనవరి మధ్య నుంచి ఇలా ప్రతీరోజు బొగ్గు సరఫరాలో కోత పడుతోంది. ఫలితంగా ఈ రెండు ప్లాంట్లలోనూ 21 రోజులకు సరిపడా ఉన్న బఫర్ స్టాక్ తగ్గుతూ వస్తోంది. దీంతో వేసవి మొదలై విద్యుత్ డిమాండ్ తీవ్ర దశకు చేరుకునే సమయంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది.
జిల్లాలోని పవర్ ప్లాంట్లకు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల నుంచి ఎక్కువగా బొగ్గు సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క సత్తుపల్లి ఏరియానే నిర్దేశిత లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేసింది. ఎప్పుడూ లక్ష్యాన్ని సాధించే మణుగూరు ఏరియా ఈసారి విఫలమైంది. ఇల్లెందు, కొత్తగూడెంతో పాటు భూపాలపల్లి ఏరియా కూడా లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయాయి. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా చేయలేకపోతోంది. దీనికి తోడు ఈ బొగ్గు నాణ్యతలోనూ జెన్కో నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదేమైనా.. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది.
విద్యుత్ కేంద్రాల్లో తగ్గిన బొగ్గు నిల్వలు
కర్మాగారానికి అవసరమైన బొగ్గు నిల్వలు పెంచాలని ఇప్పటికే సింగరేణి అధికారులను కోరాం. ప్రస్తుతం వస్తున్న బొగ్గు కంటే వినియోగం అధికంగా ఉండడంతో నిల్వలు తగ్గుతున్నాయి. 15 రోజుల కంటే ఎక్కువగా ఉపయోగపడేలా నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం వారం రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంటోంది. మార్చిలో దాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఎం.ప్రభాకర్ రావు,
కేటీపీఎస్ 5,6 దశల సీఈ


