పర్చూరు(చినగంజాం): అప్పుల భారంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణం పొందిన సంఘటన పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడవాడ గ్రామ శివారులోని పంట పొలాల్లో వీరన్నపాలెం గ్రామానికి చెందిన తిమ్మనపల్లి శ్రీనివాసరావు(50) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన గురించి స్థానికంగా గొర్రెలు మేపుకుంటున్న గొర్రె కాపర్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్చూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా శ్రీనివాసరావు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అప్పుల భారం వల్ల మనస్తాపానికి గురై శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పర్చూరు పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


