సహకరించిన మరో బంధువు కూడా.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు
తెనాలి రూరల్: ఆస్తి, డబ్బు కోసం తల్లిదండ్రులను కన్న కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడు. సహనం సహించిన తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అతడిని హత్య చేసి శవాన్ని కృష్ణా నదిలో మాయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న వేళ సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర భాస్కరరావు, బుల్లెమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కోటేశ్వరరావు(28) ఆటో డ్రైవర్. చిన్న కుమారుడు మరియదాసు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్. కోటేశ్వరరావుతో విభేదించిన భార్య కొంతకాలం క్రితం వెళ్ళిపోయింది. దీంతో నాజరుపేటలో తల్లిదండ్రులతో కలిసి కోటేశ్వరరావు ఉంటున్నాడు. వీరికి కొల్లిపరలో రెండున్నర సెంట్ల భూమి ఉంది. మద్యానికి బానిసైన కోటేశ్వరరావు ఆ భూమిని అమ్మి తనకు వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 రాత్రి కూడా ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు, రెండో కుమారుడు మరియదాసు, మరో మహిళ మున్నంగి నాగేశ్వరమ్మతో కలిసి నిందితుడిని కొట్టి, గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసును వెంటనే ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.


