చంపుతామని యజమానికి బెదిరింపు రూరల్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి చంపుతామని బెదిరింపుపై మండలంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన సాగిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని తన ఇంటిపక్కనే తన తండ్రిపేరుపై ఉన్న తొమ్మిది సెంట్ల స్థలం తమది అంటూ సమీపంలో నివాసం ఉండే కందుల మర్రిరెడ్డి, విజయలు గత కొంతకాలంగా తమతో గొడవలు బడుతున్నారన్నారు. దీనిపై అనేకమార్లు గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించినా వారు ఆ స్థలం తమదే అంటూ ఆ స్థలంలో చెత్త వేస్తున్నారన్నారు. ఆదివారం తాను ఒక కూలీ సహాయంతో స్థలంలోని చెత్తను శుభ్రం చేస్తుండగా మర్రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి అసభ్యపదజాలంతో తిడుతూ ఇనుపరాడ్లతో తన ఇంటిముందున్న కారు ముందు, వెనుకా అద్దాలను పగులకొట్టారన్నారు. దీంతోపాటు తనపై దాడిచేయగా తాను తప్పించుకొని ఇంట్లోకి వెళ్లగా ఈసారి నిన్ను ప్రాణాలతో వదిలేశామని, స్థలం జోలికి వస్తే చంపుతామని బెదిరించారన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.


