బాపట్ల: పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథయాత్ర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఇస్కాన్ కొత్తపేట, చీరాల శాఖలు, బాపట్లకు చెందిన కన్నెగంటి మంజుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. పురవీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల జయజయ ధ్వానాలు, హరినామ స్మరణతో పట్టణం మారుమోగింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శృంగారపురంలోని తాలింఖానాలో స్వామికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం నుంచి ఈ దివ్య రథయాత్ర ప్రారంభమైంది. పాత బస్టాండ్ మీదుగా జీబీసీ రోడ్డులోకి ప్రవేశించింది. గడియారస్తంభం చేరుకుని, సూర్యలంక రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి, జీబీసీ రోడ్డులో పోలేరమ్మ గుడి మీదుగా మళ్లీ తిరిగి వచ్చింది. యాత్ర పొడవునా ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు భజనలు, కీర్తనలు, నృత్యాలతో అలరించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువుల ఆధ్యాత్మిక ప్రసంగం, భోగ సమర్పణ, కనులపండువగా మహా హారతి వంటి విశేష కార్యక్రమాలను నిర్వహించారు.


