రేపల్లె: పట్టణానికి నిజమైన హీరే తమరేనని ఐఈఆర్పీ అనూరాధను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు విద్యాబుద్ధుల్ని నేర్పే భవిత సెంటర్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంకితభావంతో పనిచేస్తున్న ఐఈఆర్పీలు సమాజానికి నిజమైన హీరోలని అభినందించారు. వారి సేవలు అమూల్యమైనవని, ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. అనంతరం ఐఈఆర్పీ అనూరాధను సత్కరించారు. డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, ఆర్డీఓ బూసి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవిబాబు, ఐఈఆర్పీ సుకన్య తదితరులు పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఆన్లైన్లో నమోదైన అర్జీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి సూచనలు చేశారు. అర్జీదారులతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామానికి చెందిన బేతపూడి సీతారావమ్మ భూమి సమస్య గురించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకుడితో ఆయన నేరుగా మాట్లాడారు. ఆమెకు హక్కు కల్పించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్


