రేపల్లె: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఐసీడీఎస్ జిల్లా అధికారి రాధా మాధవి ఆదేశించారు. రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆయా కేంద్రాల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సేవల అమలు విధానం, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్ణీత సమయాలకు కచ్చితంగా నిర్వహించడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేసి పోషణ్ ట్రాకర్ యాప్లో నిరంతరం అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా బోధన ఉపకరణాలను వినియోగించి చిన్నారులకు ఆసక్తికరమైన బోధన అందించాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థలో నమోదయ్యే రెడ్ ఫ్లాగ్ కేసులను సూపర్వైజర్లు నిరంతరం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీడీపీవో ఎం.సుచిత్ర, సూపర్వైజర్లు సీహెచ్.హిమబిందు, ఎస్.సునీత, టి.రాధిక, జ్యోతిలక్ష్మి, వెంకట రమణ, నాగలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్ట్ జిల్లా అధికారి రాధా మాధవి


