గుంటూరు మెడికల్: ఐదు జిల్లాల పరిధి వరకు విస్తరించి ఉన్న గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్ నెస్ కార్యాలయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందారు. ఆయనను గుంటూరుకు కేటాయిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం అధికారికంగా గుంటూరు నగరంపాలెంలోని సీ.జీ.హెచ్ ఎస్ కార్యాలయం లో సీ.ఎం.ఓ గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరు సీ.జీ.హెచ్.ఎస్ నుంచి బదిలీ పై వచ్చిన దాసరి రమేష్ సీ.ఎం.ఓ గా ప్రస్తుతం గుంటూరులో విధులు నిర్వహిస్తున్నారు. కొండా నాగార్జునకు కూడా పదోన్నతి లభించడంతో సీ.జీ.హెచ్.ఎస్ కేంద్రాలలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో ఇద్దరు సీ.ఎం.ఓ లు విధులు నిర్వహించడం విశేషం. పదోన్నతి పొందిన కొండా నాగార్జున ను గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లోకల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లు గుమ్మడి సీతారామయ్యచౌదరి, కట్టా వెంకటేశ్వర్లు, పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.


