ఫ్యాప్టో నాయకుల డిమాండ్
బాపట్ల: ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు చింతల సుబ్బారావు, కొమ్మోజు శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు బాపట్ల కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ పి.డి.సోషలిజం పికెటింగ్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాగతీత ధోరణి సరైనది కాదన్నారు. వేతన కమిటీ ఆలస్యమయ్యేకొద్దీ ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఫ్యాప్టో కార్యదర్శి కె. పిచ్చయ్య, జిల్లా ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల జిల్లా బాధ్యులు నారాయణ, అమర్నాథ్, వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకత్వం వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో అడుగుల శ్రీనివాసరావు, బడుగు శ్రీనివాసరావు, మచ్చ వెంకటేశ్వరెడ్డి, నాగరాజు, సుభాని, రాజేష్, శివ పాల్గొన్నారు.


