బాపట్ల: ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)పీడీగా వి.నీలిమ సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ని మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందజేశారు.
ప్యాసింజర్ రైల్లో
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న మెము ప్యాసింజర్ రైల్లో గుర్తుతెలియని వ్యక్తి సోమవారం సాయంత్రం 4.25 గంటల సమయంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై సిహెచ్.కొండయ్య తెలిపారు. రైల్లో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చీరాల రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం4 పై దించి 108 సిబ్బందిని పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు, చామనఛాయ, 5.5 అడుగుల ఎత్తు ఉంటాడు. తెలుపు, బ్రౌన్ రంగు ఫుల్హ్యాండ్ షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు, నలుపు ఫ్రేమ్ కళ్లద్దాలు ధరించాడు. బొడ్డుకు కుడివైపు, ఎడమ డొక్కపై పుట్టుమచ్చలున్నాయి. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9247575633 నంబర్లో జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.
ఏఎన్యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వెల్లడించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏప్రిల్లో నిర్వహించిన ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్ పరీక్షలకు 41 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ పరీక్షలకు 22 మందికిగానూ 20 మంది, ఎంఎస్సీ బోటరీ పరీక్షలకు 66 మందికి 38 మంది, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షకు 37 మంది 31 మంది ,ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 26 మందికి 26 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ ఎన్విరాల్మెంట్ సైన్స్ పరీక్షకు 16 మందికి 16 మంది, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, నూట్రీషన్ 70 మందికి గాను 70 మంది, ఎమ్మెస్సీ జియాలజీ పరీక్షలకు ఐదుగురు, ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షకు 23 మంది హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.
డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీసెట్–2026) లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 18వ తేదీ లోపు వెబ్ ఆధారిత ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు ఏపీ డీసెట్ కన్వీనర్, పాఠశాల విద్య గుంటూరు జోన్ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈనెల 20 నుంచి 23 వరకు సీట్ల కేటాయింపు జరుపుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలని సూచించారు. డీఎల్ఈడీ ప్రధమ సంవత్సర తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభమవుతాయని, అర్హత సాధించిన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోపు ప్రవేశం పొందాలని తెలిపారు.
గుంటూరు సీసీఎస్
డీఎస్పీగా శివాజీరాజా
నగరంపాలెం: గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎస్పీ మధుసూదనరావు కర్నూలు జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం విదితమే.
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: ఈనెల 15న విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి పవన్, జి నాగరాజులు పిలుపు నిచ్చారు. ఈమేరకు గుజ్జనగుండ్లలోని సోమవారం విద్యుత్ స్టోర్స్ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు.


