చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ దాసరి రమేష్‌ | - | Sakshi
Sakshi News home page

చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ దాసరి రమేష్‌

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

గుంటూరు మెడికల్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ (సీజీహెచ్‌ఎస్‌) గుంటూరు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా (సీఎంఓ) డాక్టర్‌ దాసరి రమేష్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరంపాలెంలోని సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ రమేష్‌ను సెంట్రల్‌ ఎకై ్సజ్‌, కస్టమ్స్‌, సెంట్రల్‌ టాక్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నేతలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు అంశాలను పెన్షనర్లు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని డాక్టర్‌రమేష్‌ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడి రోగి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కొండ నాగార్జున మాట్లాడుతూ డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ తాము వందకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నామన్నారు. దూర ప్రాంత రోగులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి.వివేకానంద మాట్లాడుతూ విధి నిర్వహణలో డాక్టర్లు నిబద్ధతత, నిశ్వార్ద సేవలు అందించాలని కోరారు. రోగుల పట్ల మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. లోకల్‌ అడ్వైజరీ కమిటి మెంబర్‌ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ సీజీహెచ్‌ఎస్‌లో ఆరోగ్య సేవలు పొందడం పెన్షనర్ల హక్కు అని చెప్పారు. శస్త్రచికిత్సలకు అధిక రుసుము వసూలు చేసే ఎంప్యానల్డ్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్లు పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్‌.ఎస్‌.నగేష్‌బాబు, కె.సాంబ్రాంజ్యం, నర్సింగ్‌ ఆఫీసర్‌ హేమసుందరి, ఫార్మాశిస్టుల ఆయేషా బేగం, సునిల్‌, వైద్య సిబ్బంది పేరేశ్వరరావు, మురళి, రామారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement