నివాళులర్పించిన దళిత, ప్రజా సంఘాల నేతలు
చీరాల రూరల్: దళిత ఉద్యమనేత, చీరాల జాన్పేటకు చెందిన కోటి జేమ్స్ అనారోగ్యంతో సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి జేమ్స్ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. కార్మిక నాయకుడిగా హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారు. కారంచేడు మారణకాండ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు సాగించారని నాయకులు గుర్తుచేసుకున్నారు. దళిత ఉద్యమ శిఖరం డాక్టర్ కత్తి పద్మారావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. దళిత మహాసభ ఉపాధ్యక్షుడిగా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జేమ్స్.. చివరి దశలో క్రీస్తు పరిచర్యలో గడిపారని వివరించారు. జేమ్స్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్, కొరివి వినయకుమార్, దారా అంజయ్య, పులిపాటి బాబురావు, గోసాల ఆశీర్వాదం, దుడ్డు భాస్కరరావు, భగత్సింగ్, తేళ్ల వెంకటస్వామి, బి.లక్ష్మీనరసయ్య, గొర్రెపాటి రవికుమార్ తదితరులు ఉన్నారు.


