మంగళగిరి రూరల్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన 750 కోట్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక ధర్నా సోమ వారం 13వ రోజుకు చేరుకుంది. మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద కొనసాగుతున్న ధర్నాలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్యూనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోత్ రమేష్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు జిల్లాల వారీగా ధర్నాలు కొనసాగనున్నాయని, అప్పటికీ ప్రభు త్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే జూలై 20న రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలు మహా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు, టీడీపీ కేంద్ర కార్యాలయం, వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ ముట్టడి చేపట్టి మహా ధర్నా చేపడతామని ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోతు రమేష్ హెచ్చరించారు. కారం సత్య మాట్లాడుతూ సబ్సిడీలు అందక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు రోడ్లు పడ్డారని వాపోయారు. పర్సంటేజ్ రూపంలో కాకుండా 100 శాతం సబ్సిడీల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బేతపూడి విజయ్, బంటు వీర్రాజు, జక్కుల రాజు, జక్కుల నారాయణ, బత్తుల విష్ణుమూర్తి, జూపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


