సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ మేనేజర్ జి.వెంకట రమణారావు
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్గదర్శకాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులందరూ తమ ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) వివరాలను వెంటనే నవీకరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ జి. వెంకట రమణారావు శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చన్నారు. సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సందర్శించి కూడా కేవైసీ వివరాలను నవీకరించుకోవచ్చు. కేవైసీని సకాలంలో పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. అలాగే ఖాతాల భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఇంకా కేవైసీ పూర్తి చేయని ఖాతాదారులు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. బ్యాంకు శాఖ, కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు అన్ని శాఖల్లో ఈ–కేవైసీ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని కోరారు.
గుంటూరు ఎడ్యుకేషన్: టెట్కు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో సైకాలజీ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సైకాలజీ నిపుణుడు డాక్టర్ టి.సుగంధరావు పర్యవేక్షణలో సైకాలజీపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు, శిక్షణా తరగతులను గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని కోరారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో తాళాలు వేసిన ఓ ఇంట్లో చోరీ చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న లక్ష్మీఅనూష పట్టణంలోని మన్నెంవారి బజార్, సీకే గ్రౌండ్స్ సమీపంలో కుటుంబ సభ్యులతో నివాసముంటోంది. తన సోదరికి ఆరోగ్యం బాగోకపోవడం వలన కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి లక్ష్మీఅనూష మంగళగిరిలోని అక్కయ్య ఇంటికి వెళ్లింది. శుక్రవార ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలకొట్టి ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఘటనపై మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో లక్ష్మీ అనూష ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించారు.
● మెడికల్ కళాశాల వద్ద స్టీల్ అపహరణ
● పట్టించుకోని అధికారులు
బాపట్ల: ప్రజా సొమ్ముతో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాల వద్ద అర్ధంతరంగా నిలిచిపోయిన పనులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. కోట్లాది రూపాయిలు వెచ్చించి 30 అడుగుల లోతు నుంచి వేసిన పిల్లర్లను కోసుకుని దొంగలు వెళుతున్నప్పటికీ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలో స్టీల్ను దొంగిలించిన ప్రదేశాన్ని కోన రఘుపతి శుక్రవారం పరిశీలించారు. పిల్లర్లు తొలగించటం వల్ల మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పనిగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కోన వివరించారు. మెడికల్ కళాశాల కోసం ఇప్పటి వరకు రూ.48 కోట్లు ఖర్చు చేశారని, ఆ మేరకు కాంట్రాక్టర్కు కూడా బిల్లులు చెల్లించినట్లు తెలిపారు.
రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లిస్తే ఆ ధనం ప్రజా ధనంగా భావించి వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోన పేర్కొన్నారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరారు. కనీసం రక్షణ చర్యలైనా తీసుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాలను పరిశీలించిన వారిలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, నక్కా వీరారెడ్డి, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్, గంగిశెట్టి రత్తయ్య, ఎం.రమేష్, నర్రావుల వెంకట్రావు, ఉరబిండి గోపినాథ్, ఆట్ల నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


