గుంటూరు రూరల్: బహుముఖ ప్రజ్ఞాశాలి, దార్శనికుడు బొమ్మిడాల గ్రూపు కంపెనీల చైర్మన్ దివంగత బొమ్మిడాల భానుమూర్తి అని నీతి అయోగ్ పూర్వ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఇన్నర్ రింగ్రోడ్డులో శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన బొమ్మిడాల భానుమూర్తి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో వ్యాపార కుటుంబంలో జన్మించిన బొమ్మిడాల భానుమూర్తి 19వ సంవత్సరంలోనే కంపెనీ బాధ్యతలు స్వీకరించారన్నారు. ఆనాటి నుంచి అంచలంచెలుగా దేశ విదేశాలలో వ్యాపార విస్తరణ చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారని కొనియాడారు. భానుమూర్తి జయంతి సందర్భంగా కాకాని రోడ్డు ఆయన పొగాకు కంపెనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం బొమ్మిడాల భానుమూర్తి జీవిత చరిత్రపై బీకే సుధాకర్రెడ్డి రాసిన బై ఎగ్జాంపుల్ ఎ లోన్ ది లైఫ్ అండ్ లెగసి ఆఫ్ బొమ్మిడాల భానుమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తల కృషి ఎంతైనా అవసరమని చెప్పారు. కష్టించే మనస్తత్వం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి, వ్యాపార దక్షత, నిజాయితీ, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల తయారీ ఎగుమతుల ద్వారా బీబీఎం గ్రూపు సంస్థలు దేశ విదేశాలలో గొప్ప పేరు గడించాయన్నారు. బొమ్మిడాల భానుమూర్తి సుదీర్ఘ వ్యాపార ప్రయాణం వర్తమాన బహుశా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకమని కొనియాడారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భానుమూర్తి వ్యాపార రంగంలో సూర్యునిలా విరాజిల్లుతూ దశ దిశలా వెలుగులు పంచారని కీర్తించారు. భానుమూర్తి సోదరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల శ్రీకష్ణమూర్తి మాట్లాడుతూ అందరికంటే చిన్నవాడిగా ఉన్న తనను అన్నగా ఆదరించి విద్యాబుద్ధులు, వ్యాపార దక్షతలు నేర్పి తన అభివృద్ధికి బాటలు వేశారని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొమ్మిడాల భానుమూర్తి మెమోరియల్ అవార్డును డాక్టర్ ప్రద్యుత్ వాగ్రేకు ప్రదానం చేశారు. ప్రతి ఏడాది ఇచ్చే సీఎస్ఆర్ ఫౌండేషన్ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు రమణదీక్షితులు, బీవీ శ్రీమన్నారాయణ, బీఎస్వీ కోటిరత్నం, బీవీ రాజా వరప్రసాద్, పీజీ అరుణ పద్మ శ్రీనివాస్, బొమ్మిడాల కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, భానుమూర్తి గ్రూపు కంపెనీల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ పూర్వ చైర్మన్
బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం


