చినుకులు రాలినా ఉరిసే పైకప్పులు.. కాలం దాటిన బల్లలు.. విరిగిపోయిన కుర్చీలు.. అరిగిపోయిన చాక్పీస్ ముక్కలు.. చెట్ల కిందే పాఠాలు.. నేలమీదే చదువులు.. ఇదీ 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల దుస్థితి..
వైఎస్సార్సీపీ హయాంలో..
వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి.. నాడు – నేడు కింద పాఠశాలలకు నిధులు వెల్లువెత్తాయి. నూతన గదులు మంజూరయ్యాయి.. కొత్త బల్లలు చేరాయి.. నల్లబల్ల స్థానంలో డిజిటల్ బోర్డు ప్రత్యక్షమైంది.. మరుగుదొడ్లు బాగుపడ్డాయి.. సౌకర్యాలన్నీ మెరుగుపడ్డాయి.. ఫలితంగా పిల్లలసంఖ్య పెరిగింది.. చూస్తుండగానే సర్కారు బడి కళకళలాడింది. ప్రభుత్వ బడి కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెంది అక్షర విప్లవం సాగించింది. దీనికితోడు ‘అమ్మ ఒడి’ కొండంత అండ ఇచ్చింది. ఇంకేముంది అడ్మిషన్ల సంఖ్య రెట్టింపైంది. బడి ముందు ‘అడ్మిషన్లు ఫుల్’ బోర్డు దర్శనమిచ్చింది..
నాడు– నేడు పథకం అటకెక్కింది.. పాఠశాల ఆవరణలోని నూతన తరగతి గది నిర్మాణం ఆగింది..అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. మధ్యాహ్న భోజనంలో.. విద్యా కానుకలో నాణ్యత కొరవడింది... మరుగుదొడ్లలో నీరు కరువైంది.. అపరిశుభ్రత తిష్ట వేసింది.. అంతే.. మెలమెల్లగా పిల్లల సంఖ్య తగ్గింది.. చూస్తుండగానే డ్రాపవుట్ల సంఖ్య వేలకు పెరిగింది.. కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయం విద్యా వ్యవస్థకే శాపంగా మారింది. ఇలాగే కొనసాగితే అక్షరాస్యతా శాతంపైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.


