కురబలకోట : మదనపల్లె–అంగళ్లు మార్గంలోని ఓ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు కొట్టుకోవడం కలలాన్ని రేపింది. దీంతో కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని తర్వాత క్రమంగా సద్దుమణిగాయి. విద్యార్థి వర్గాల కథనం మేరకు..శనివారం కళాశాలలో టీచర్స్డే నిర్వహించారు. అనంతరం ఫొటోలు తీసుకునే విషయంలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం తలెత్తింది. తోటి విద్యార్థులు చూస్తుండగానే ఊహించని విధంగా ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కళాశాల సిబ్బంది వారిని విడదీయడానికి యత్నించినా వినలేదు. అనంతరం సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసి పంపివేయడంతో వివాదం సద్దుమణిగింది. వ్యక్తిగత కారణాలు కూడా ఈ వివాదానికి దారి తీసి ఉండవచ్చన్న వాదనలు కూడా మరో వైపు విన్పిస్తున్నాయి. గొడవ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
డ్వాక్రా సంఘం లీడర్పై
ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని పూల వీధికి చెందిన డ్వాక్రా సంఘం సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిసి తమ సంఘం మాజీ లీడర్పై ఫిర్యాదు చేశారు. పూల వీధికి చెందిన గణేష్ గ్రూపునకు గతంలో లీడర్గా వ్యవహరించిన స్వరూప, సంఘానికి సంబంధించిన సుమారు రూ.2.10 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని సభ్యులు మంగమ్మ, లక్ష్మీదేవి, మధుమాలతి ఆరోపించారు. సంఘం సభ్యులకు తెలియకుండా నగదు వినియోగించుకున్నారని, దీనిపై ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు ఎస్పీకి వివరించినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘం నిధులు తిరిగి ఇప్పించి, తమకు న్యాయం చేయాలని బాధిత సభ్యులు ఎస్పీని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ సంబంధిత వివరాలను పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
నేరాల నివారణకు ప్రత్యేక నిఘా
మదనపల్లె టౌన్ : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. నేరాల నివారణ, రోడ్డు భద్రత దృష్ట్యా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దూర ప్రయాణం చేసే వాహనదారులు నిద్రమత్తులో ప్రమాదాలకు గురికాకుండా ‘ఫేస్ వాష్ అండ్ గో‘కార్యక్రమంతో అవగాహన కల్పిస్తున్నారు. అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ, జిల్లా సరిహద్దులు, ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
మద్యం తాగించి.. నగలు దోచేసి
సాక్షి టాస్క్ఫోర్స్ : లక్కిరెడ్డిపల్లి మండలంలోని దిన్నెపాడు గ్రామం, బెస్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కదిరమ్మ అనే మహిళ ఇంట్లో రెండు రోజుల క్రితం 23 గ్రాముల బంగారంతో పాటు రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ శోభ సోమవారం కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఓ నాయకుడు బాధితురాలికి మద్యం తాగించి నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితురాలితో పాటు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకటో తేదీన పింఛన్ డబ్బులు తీసుకుంటున్న కదరిమ్మను గమనించిన ఆయన ఆమె ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గమనించి బాధితురాలికి మద్యం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే ఇంట్లోకి చొరబడి బీరువాలోని 23 గ్రాముల బంగారం, రూ.35 వేల నగదుతో పరారయ్యాడని తెలిపారు. బాధితురాలు మేల్కొని చోరీ విషయాన్ని గమనించి ఇంటి ముందు కూర్చుని కన్నీటి పర్యంతం అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఆమెను ఆరా తీయగా తన ఇంట్లోని నగదు, నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి కుమారులు ఆ రోజు రాయచోటి పట్టణానికి వెళ్లిన సమయాన్ని గుర్తించి ఇంట్లోకి చొరబడినట్లు తెలిపారు. కుమారులు ఇరువురు ఇంటికి చేరుకోగా బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శోభ తెలిపారు. విచారణ చేపట్టి నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.
కొట్టుకున్న విద్యార్థినులు


