మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో ఆదివారం సాయంత్రం ఆటో బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం, వనగాని పల్లెకు చెందిన శ్రీనివాసులు (45) బైకులో సొంత పని మీద మదనపల్లె కు బయలుదేరాడు. బసినికొండ గంగమ్మ గుడి వద్దకు రాగానే, మదనపల్లె జెండామాను వీధికి చెందిన మస్తాన్ ఆటో లో బైకుకు అడ్డొచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
జేసీబీ ఢీకొని కార్మికుడికి..
మదనపల్లె టౌన్: మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై జేసీబీ ఢీకొని బండ పని చేసే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చీకలగుట్ట గౌతిమీ నగర్లో ఉంటున్న డేరంగుల వెంకటరమణ (60) స్థానికంగా ఉన్న క్వారీలో పనిచేసి ఇంటికి వస్తుండగా, అమ్మ చెరువు మిట్టపై జేసీబీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటో ఢీకొని ఇద్దరు రైతులకు..
మదనపల్లె టౌన్: ఆటో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడిన ఘటన పీటీఎం మండలంలో చోటుచేసుకుంది.జిల్లా ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీటీఎం మండలం మల్లెల పంచాయతీ కానుగమాకుల పల్లెకు చెందిన రైతు యు.రెడ్డప్ప (65), బి.కొత్తకోటకు చెందిన వెంకటరమణరెడ్డి (62) సొంత పనిపై ద్విచక్ర వాహనంలో కర్ణాటక సరిహద్దులోని చేలూరుకు వెళ్లారు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కానుగమాకులపల్లి వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. రెడ్డప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై పీటీఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపారు.


