తిరుపతి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని తిరిగి వస్తున్న ట్రావెల్స్ మేనేజర్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చెర్లోపల్లి అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి ఫోన్ను నేలకేసి పగులగొట్టడంతోపాటు మెడలోని 9 గ్రాముల బంగారు చైన్ను లాక్కుని, చంపేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం మేరకు... అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, మంచిరెడ్డిపల్లికి చెందిన పి.చంద్రమోహన్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదిపట్ల కృష్ణ ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఇస్కాన్ ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని ఆదివారం తెల్లవారు జామున తిరిగి వస్తుండగా చెర్లోపల్లి సమీపంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలను ర్యాష్గా నడుపుతూ వెళ్తున్నారు. చంద్రమోహన్ హారన్ కొట్టగా వారు వాహనాలను అడ్డంగా పెట్టి అతడిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అనంతరం బాధితుడి మెడలోని బంగారం చైన్ లాక్కుని వెళ్లారు. తనపై దాడి చేసిన వారిలో ఒకరు తన పేరు అజయ్ అని, తాను రౌడీషీటర్నని, చంపేస్తానంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. తన ఫోన్ను నేలకేసి పగులగొట్టి వెళ్లారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన సమీపంలోని ఓ దుకాణం వద్ద సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో దాని ఆధారంగా కొర్లగుంట కొత్తపల్లికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ అజీమ్, తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన గోశాల రుద్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు వినయ్ అలియాస్ బబ్లూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


