మదనపల్లె టౌన్న్ : మదనపల్లె సర్వజన ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆదివారం ఆసుపత్రి ప్రాంగణం సమీపంలో వ్యక్తి విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటన స్థలానికి వచ్చి విచారించారు, మృతుడు మదనపల్లె మండలం, టేకులపాలెంకు చెందిన సోమశేఖర్ (40) గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడు చికిత్స కోసం వచ్చి మృతిచెందాడా? లేక అనారోగ్యంతో ఆసుపత్రి ప్రహరీ వద్దే ఉంటూ మృతి చెందాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని తమకు కేసు వద్దని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు.
60 బోర్ల వద్ద కేబుల్
వైర్లు చోరీ
గుర్రంకొండ: 60 బోర్ల వద్ద ఉన్న 725 మీటర్ల బోరుమోటారు కేబుల్ వైర్లను దుండగులు కత్తిరించి ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని తరిగొండ పంచాయతీలో జరిగింది. పంచాయతీ పరిధిలోని తరిగొండ, పిల్లగోవులవారిపల్లె,ఇరగన్నగారిపల్లె, రెడ్డివారిపల్లె, గ్రామాల పరిధిలో గత రాత్రి కేబుల్ వైర్లు చోరీ ముఠా సభ్యులు 48 మంది రైతులకు చెందిన పొలాల వద్ద ఉన్న బోర్లకు అమర్చిన కేబుల్ వైర్లను కత్తిరించేశారు. ఒక్కో బోరు మోటారు దగ్గర పది నుంచి 12మీటర్ల మేరకు కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే పొలాల వద్దకు బోరుమోటారు ఆన్చేయడానికి వెళ్లిన రైతులకు కేబుల్ వైర్లు కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో బోరుమోటార్లు పనిచేయక మెకానిక్ల వద్దకు పరుగులు తీశారు. మళ్లీకొత్తగా కేబుల్ వైర్లు అమర్చాలంటే ఒక బోరుకు రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా తరిగొండ గ్రామంలోని ఇందిరమ్మకాలనీ రెండు పంచాయతీ తాగునీటి బోర్లకు అమర్చిన కేబుల్ వైర్లను దుండగులు కత్తిరించి వేశారు. దీంతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది.
మద్యం మత్తులో
నిప్పంటించుకున్న వ్యక్తి
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని గడ్డం వారి పల్లెలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో హజరత్ ( 55 ) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా ఉంటున్న హజరత్ ఇంట్లో నుంచి మంటలు కనిపించేసరికి చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. తాను ఆసుపత్రికి రానని హజరత్ కొంతసేపు బెట్టు చేశాడు. రాత్రి 9.40 ప్రాంతంలో ఇరుగుపొరుగువారు అతన్ని అంబులెన్స్ ఎక్కించగా చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


