● మిలాద్ జులూస్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా
● పాల్గొన్న నగర ప్రముఖులు, జనం
కడప సిటీ : మహమ్మద్ ప్రవక్త (సొ.అ.వ) చూపిన మార్గం అనుసరణీయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా తెలిపారు. బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్నబీ సందర్భంగా కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ మర్కజి మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో జులూస్ (ర్యాలీ) నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని అల్మాస్పేటవద్దగల ఇనాత్ ఖాన్ తాలిం నుంచి ప్రారంభమై ఆగాడి, మోచంపేట, మట్టి పెద్దపులి, చెన్నూరు బస్టాండ్, 1వ గాంధీ బొమ్మ సర్కిల్, పొట్టి శ్రీరాములు సర్కి ల్, 7 రోడ్లు మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్బీఅంజద్బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎప్పటికీ నిజాయితీగా ఉండాలని సూచిస్తాయన్నారు. సత్యం మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుందని వివరించారు. ఈ ర్యాలీలో మత గురువు హజరత్ వలీవుల్లా సాహెబ్, హజరత్ మహమ్మద్ అలీ బాగ్దాదీ, నగర ముస్లిం ప్రముఖులు అమీర్బాబు, సలావుద్దీన్, మగ్బూల్బాషతోపాటు పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరానికి విశేష స్పందన
మిలాదున్నబీ సందర్భంగా జూలూస్ అనంతరం గుంత బజార్ మసీదులో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపుగా వందమంది రక్తదానం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ బాగ్దాది, ఖూన్కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తారీఖ్, అల్లా బకాష్, సలావుద్దీన్, అలీ షేర్ రాయల్ కరిముల్లా, జేకే యూత్ ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.


