సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయరహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదదంలో నాగం దేవర్షణీ (8) అనే చిన్నారి మృతి చెందింది. పోలీసులు,స్థానికుల వివరాలమేరకు దేవపట్లకు చెందిన నాగం ఈశ్వరరెడ్డి, రమాదేవి దంపతులు ఫాస్ట్పుడ్ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే దంపతులు ఓ వివాహానికి వెళ్లి వచ్చారు. ఇంటి తాళాలు చిల్లర దుకాణంలో ఉన్నాయని కూతురు దేవర్షిణీకి చెప్పడంతో ఆ చిన్నారి అక్కడి వెళ్లి తాళాలు తీసుకొని వస్తుండగా రాయచోటి వైపు నుంచి గొర్రెల లోడుతో వస్తున్న వాహనం ఢీకొంది. దీంతో దేవర్షణి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కన్న కూతురు చనిపోతుంటే ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ రవికుమార్ చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


