వెంగమాంబకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేద పండితులు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన తరిగొండ మాతృశ్రీ వెంగ మాంబ వర్ధంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. శుక్రవారం వెంగమాంబ వర్ధంతి కావడంతో టీటీడీ వారి తరఫున టీటీడీ అధికారులు వెంగమాంబకు పట్టువస్త్రాలు, ఇతర సామగ్రిని తిరుమల నుంచి సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి వేకువజామునే పలురకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంతోపాటు తరిగొండ బస్టాండులో ఏర్పాటు చేసిన వెంగమాంబ కూడలి వద్ద కూడా వెంగమాంబకు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజానమునే స్వామివారికి పాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. పంచామృతాలకు ప్రత్యేకంగా మూలవర్లకు అభిషేకాలు కావించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు ఆకట్టుకొంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ఎదుట యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. వెంగమాంబ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి శ్రీవెంగమాంబ ప్రాజెక్ట్ కళాకారులచే నిర్వహించిన కచేరి అలరించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం


