మదనపల్లె టౌన్ : నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. గుర్రంకొండ మండలంలో శనివారం జరిగిన ఈ ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన సురేంద్ర కుమార్తె కోమల(27)కు నెల రోజుల క్రితం తమ దగ్గరి బంధువుతో పెళ్లి నిశ్చయమైంది. మరో నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లాల్సిన కోమలకు ఏం కష్టం వచ్చిందో ఏమో చిన్న మనసు చేసుకుంది. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాధితురాలిని తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించినా ఆ యువతి ఆరోగ్యం కుదుట పడలేదు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలను గుర్రంకొండ పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
ఆత్మహత్యకు యత్నించిన యువతి


