చౌడేపల్లె: దాదేపల్లెలోని హజ్రత్ సయ్యద్ పీర్ మషాయఖ్ బహదూర్ అలీషా బాబా దర్గాలో ఈనెల16,17,18 తేదీల్లో ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. శనివారం తిరుపతిలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేపాటు రాజంపేట ఎంపీ పివి.మిథున్రెడ్డితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు ఉరుసుకు కుటుంబ సమేతంగా రావాలని పెద్దిరెడ్డికి ఆహ్వానపత్రిక, దర్గాలోని బాబా మజార్ వద్ద ఫాతెహా చేపట్టిన ప్రసాదాన్ని అందజేశారు. ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ బాబా కరామత్ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరారు. మతపెద్దలు మాట్లాడుతూ 16వతేదీ ఆదివారం గంధం ,17 న ఉరుసుతోపాటు రాత్రి ఖవ్వాలి పాట కచేరి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలకు ఆహ్వానపత్రికలు అందజేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అస్లం ముకరంసాబ్రి, గుజరాత్కు చెందిన ఫైరోజ్ రా హాత్ చిష్టి హాజరౌతున్నట్లు తెలిపారు. 18 న మంగళవారం తహలీల్ ఫాతెహా ముగుస్తుందన్నారు,మైనార్టీ నాయకులు సుల్తాన్సాబ్,రెడ్డిభాషా, షేర్ఖాన్, సనావుల్లా, రియాజ్అహమ్మద్, మషాయక్, దాదాఫీర్,ఫైరోజ్,ఆరీపుల్లా,బావాజాన్, జహీర్ అహమ్మద్ పాల్గొన్నారు.
చంద్రబాబును నమ్మినందుకు టీచర్ల పరిస్థితి అగమ్యగోచరం
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి మారుతీనగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. టెట్ సమస్యపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు మళ్లీ వైఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారన్నారు.


