మదనపల్లి టౌన్: ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని కర్నూలు రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి సోమవారం ఆయన పీలేరు, మదనపల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సాంకేతికతను వాడుకుంటూ దర్యాప్తు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఎస్పీ పీలేరు స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఈ – క్రాప్ బుకింగ్ చేసుకోండి
ములకలచెరువు: ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోతున్న రైతులు ఈ – క్రాప్ బుకింగ్ చేసుకోవాలని గుంటూరు వ్యవసాయశాఖ కమిషనరేట్ డెప్యూటీ డైరెక్టర్ పోలప్ప అన్నారు. సోమవారం ఆయన మండలంలోని వేపూరికోటలో ఈ – క్రాప్ బుకింగ్, పంటల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎల్నినో ప్రభావం నివారించడానికి కార్యచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పంటలు పండించిన రైతులు ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన పథకం ద్వారా బీమా చేసుకోవాలన్నారు. ఈ సమయంలో కంది, ఉలవలు విత్తుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏడీఏ నవీన్కుమార్, ఏఓ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకు కడపలోనే ఇమిగ్రేషన్ ఏర్పాటు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : కడప విమానాశ్రయం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని వసతులు కలిగిన నేపథ్యంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి ఇమిగ్రేషన్తోపాటు కడప నుంచి నేరు గా విమానం ద్వారా జిద్దాకు చేరుకునేలా చూ డాలని ఏపీ ఉలేమా అయిమ్మ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్వో మల్లికార్జునుడికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా రాయలసీమ మధ్యలో ఉన్నందున జిల్లాతోపాటు అన్నమయ్య, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన హాజీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనివల్ల రాయలసీమ హాజీలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను వాడుక లోకి తీసుకురావాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే హాజీలను భవనంలో వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌల్వీలు మహమ్మద్ అలీ బద్దాదీ సాహెబ్, వలీవుల్లా హుస్సేనీ సాహెబ్, న్యామతుల్లా సాహెబ్, అబ్దుల్ రెహమాన్ సాహెబ్, షకృద్దీన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, వాహిద్ అలీ సాహెబ్, టీడీపీ నాయకుల అమీర్ బాబు, డీసీసీ మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, సంఘ సేవకులు సలావుద్దీన్ పాల్గొన్నారు.
కేజీబీవీ ప్రొవిజినల్మెరిట్ జాబితా విడుదల
కడప ఎడ్యుకేషన్:జిల్లాలోని కేజీబీవీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లావ్యాప్త ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ తెలిపారు. మెరిట్ జాబితా, ఖాళీలు, రోస్టర్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ వివరాలను htt p://kadapadoe.i n వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 12వ తేదీ లోపల httpr://kfbvrecruitment.apcfrr.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీన కడప శంకరాపురంలోని ‘స్కౌట్ హాల్’ నందు అసలు సర్టిఫికేట్లతో హాజరుకావాలని ఆమె కోరారు.


