మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..బీహార్ రాష్ట్రం, భగల్పూర్కు చెందిన దీపక్కుమార్ (21), సందీప్కుమార్(20) మరికొందరు వచ్చి కురబలకోట మండలం, అంగళ్లులో స్థిరపడ్డారు. అంగళ్లు, మదనపల్లె, గుర్రం కొండ తదితర ప్రాంతంలో ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్రంకొండలో ఓ ఇంటికి పెయింట్ పని ముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంపై అంగళ్లు వెళ్తుండగా డాబా హోటల్ వద్ద మరో బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని 108లో వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. దీంతో వారు ప్రాణాపాయం తప్పి కోలు కుంటున్నారు. గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటర్ ఢీకొని బాలుడికి..
మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొని బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఘటనపై వివరాలు ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం, కురబలకోట మండలం, అంగళ్లు పంచాయతీ తుమ్మచెట్లపల్లికి చెందిన మహేష్(16) స్నేహితునితో కలిసి బైక్పై అంగళ్లకు వస్తుండగా, మార్గమధ్యంలోని అంగళ్లు మసీదు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్కు కాళు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహేష్ను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పీలేరు రూరల్ : ఆగి ఉన్న ట్యాంకర్ను ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చిత్తూరు రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. పీలేరు పట్టణానికి చెందిన దిలీప్రెడ్డి (21) తల్లి రమాదేవి (50) ద్విచక్రవాహనంలో ఇందిరమ్మ కాలనీలో బంధువుల ఇంటికి బయలుదేరారు. రిలయన్స్ పెట్రోల్బంకు వద్ద ఆగివున్న ట్యాంకర్ను వేగంగా వెళ్లి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని చికిత్సనిమిత్తం 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


