జూదరుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జూదరుల అరెస్ట్‌

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

గాలివీడు : మండలంలోని దానంరెడ్డిగారిపల్లె సమీపంలో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.40300తోపాటు ఆరు సెల్‌ఫోన్లు, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.

వ్యక్తిపై దాడి

మదనపల్లె టౌన్‌ : భూమి ఒరిజినల్‌ పత్రాలను ఎత్తుకెళ్లినందుకు ఓ రియల్టర్‌ తన ప్రత్యర్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దాడి చేసిన ఘటన శనివారం మదనపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు వన్‌ టౌన్‌ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలంలోని కొండామారిపల్లికి చెందిన రవీంద్ర(42) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన మాణిక్యంతో కలిసి పనులు చేసేవాడు. ఆ చనువుతో తన భూమిని అమ్మిస్తానని 2018లో 20 ఎకరాల భూమి ఒరిజినల్‌ పత్రాలను మాణిక్యం ఎత్తుకెళ్లాడని రవీంద్ర ఆరోపించాడు. పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మాణిక్యం.. తనపై దాడి చేసినట్లు రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన 1టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. భూ వివాదం, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గాయపడిన రవీంద్ర స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రైలు కింద పడి

వ్యక్తి మృతి

పీలేరు రూరల్‌ : రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం మోడల్‌ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శనివారం మోడల్‌ కాలనీ వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన షాబుద్దీన్‌(45)గా గుర్తించారు. షాబుద్దీన్‌ బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి 15 ఏళ్లుగా అక్కడే ఉండి కుటుంబాన్ని పోషించాడు. గత కొన్నేళ్లుగా భార్యాబిడ్డలతో మనస్పర్థలు వచ్చి షాబుద్దీన్‌ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పీలేరులోని తమ బంధువుల ఇంటి నుంచి వెళ్లిన షాబుద్దీన్‌ శనివారం ఉదయం రైల్వేట్రాక్‌ మృతదేహంగా కనిపించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహీధర్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చాపాడు మండల పరిధిలోని వెదురూరురాజుపాలెం గ్రామానికి చెందిన మహీధర్‌ ప్రొద్దుటూరు నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పని నిమిత్తం బైక్‌లో ఎర్రగుంట్లకు వస్తుండగా పోట్లదుర్తి గ్రామ సమీపంలో టీప్పర్‌ ఢీకొనంది. ఈ ప్రమాదంలో మహీధర్‌కు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు విద్యార్థిని 108 వాహనంలో ప్రోద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement