నిమ్మనపల్లె (మదనపల్లి టౌన్): అన్నమయ్య జిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కలపను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి సైదులు మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి గ్రామం వద్ద చెట్లను నరికి అక్రమంగా లారీలో తరలిస్తుండగా, సమాచారం అందుకున్న ఎఫ్బిఓ దీప లారీని అడ్డుకుని రికార్డులను పరిశీలించారు. అయితే లారీకి ఎలాంటి పర్మిట్లు, అనుమతులు లేకపోవడం, కటింగ్ ఆర్డర్ కూడా లేకుండానే కలపను అక్రమంగా నరికించి తరలిస్తున్న అభియోగాలపై అటవీ శాఖ అధికారులు లారీ డ్రైవర్, యజమాని హుసేన్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ కలప లారీని మదనపల్లె బసినికొండ లో ఉన్న నగరవనంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్టార్టర్లు,కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె గ్రామంలో నరసింహులు అనే రైతు తోటలో రెండు రోజుల క్రితం స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. నరసింహులు కనంపల్లె గ్రామ సమీపంలో భూమిని కౌలుకు తీసుకు ని పంటలు సాగు చేస్తున్నాడు. ఆ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ.22 వేల విలువ గల రెండు స్టార్లర్లు, కేబుల్ వైర్లను అపహరించుకపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం బాధిత రైతు సీఐ శ్రీ రామ్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్
పులివెందుల రూరల్ : ఏసీబీ అధికారి అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ శ్రీరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 2022 సెప్టెంబర్ నెలలో పులివెందుల భాకరాపురం చెందిన వీఆర్ఓ నుంచి రూ.40వేల డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈ విషయంలో అప్పట్లో పులివెందుల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపామని సీఐ శ్రీరామ్ తెలిపారు.


