● కబ్జాకు యత్నిస్తున్నారంటూ
బాధితురాలు ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : మదనపల్లెలోని కురవంక ప్రాంతంలో ఇంటి స్థలం రక్షణ గోడను కిరాయి రౌడీలు ధ్వంసం చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. శనివారం ఉదయం బాధితురాలు నాగిరెడ్డిగారి వాణి స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులో ఆమె తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కురవంకలో 2008లో తన కుమార్తె అనూష పేరిట ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. అనంతరం దాన్ని తన పేరున జీపీ చేయించి అనూషా అమెరికాకు వెళ్లారని తెలిపారు. ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు కిరాయి గుండాలతో వచ్చి రక్షణ గోడను ధ్వంసం చేశారని ఆరోపించారు. అడ్డుకున్న తమపై దాడి చేసి గాయపరచి, చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు అందుకున్న వన్టౌన్ సీఐ రాజారెడ్డి పోలీసులను సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. భూ వివాదం కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కురవంక ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.


