కురబలకోట: హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తావు లేదని స్పష్టం చేసినప్పటికీ యథేచ్ఛగా మరోసారి భూ కబ్జాకు బరితెగించారు. వివరాలలోకి వెళితే...కురబలకోట మండలం వినాయక చేనేతనగర్లో విలువైన మూడు ఎకరాల డీకేటీ స్థలం ఉంది. ఇది మదనపల్లె పట్టణానికి దగ్గరగా ఉండడంతో గతంలో కూడా కొందరు ఇక్కడ ఈ భూమిలో ప్రవేశించి ఆక్రమణకు యత్నించారు. అప్పట్లో రెవెన్యూ అదికారులు అడ్డుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మరోసారి మళ్లీ శుక్రవారం ఆక్రమణదారులు జేసీబీతో చదును చేయడం ప్రారంభించారు. గమనించిన స్థానికులు అప్రమత్తమై వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఆదేశాలతో వీఆర్వో ఖాదర్ బాషా ఆక్రమణ స్థలానికి వెళ్లి పనులను నిలుపుదల చేయించారు. నిర్మాణాలను కూడా కూలదోయించారు. ఇందులో ఎవ్వరూ ప్రవేశించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తహసీల్దారు ధనుంజయలు తెలిపారు. ప్రభుత్వస్థలాల కబ్జాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.


