రాయచోటి టౌన్ : కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. వలరాజు ఆరోపించారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ 90 సంత్సరాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను కార్పోరేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాద సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షీప్ బకాయిలు కేవలం వంద రోజుల్లోనే ఆయా కళాశాల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారన్నారు. రెండు సంవత్సరాలైనా బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకొంటున్నారని విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు లోకేష్, నరేష్, సుబాన్,మల్లిఖార్జున, లక్ష్మీకర్, తదితరులు పాల్గొన్నారు.


