● కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వుల ధిక్కరణ
● అడ్డుకునేందుకు ప్రయత్నించిన
భూయజమానులకు బెదిరింపులు
మదనపల్లె టౌన్: వివాదాస్పద భూమిలోకి చొరబడి దౌర్జన్యం చేస్తూ, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ధిక్కరించి, భూ యజమానులను బెదిరిస్తున్నారని బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం బాధితులు గాలిపూర్ణానంద చౌదరి, గుండ్లూరి నారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు... మదనపల్లె మండలం, పొన్నూటిపాళ్యం రెవెన్యూ గ్రామపరిధిలోని సర్వే నంబర్.420–12కు సంబంధించి...ఏ లో 4.32 ఎకరాలు, బీ లో 3 ఎకరాలు మొత్తం కలిపి 7.32 ఎకరాలు 1975లో సబ్ డివిజన్న్ చేశారు. ఈ భూమిని 2013–14లో బాసాని రెడ్డిగోపాల్నాయుడు, కుటుంబసభ్యుల పేరుమీద 2.22 ఎకరాల భూమిని మొత్తం 8 డాక్యుమెంట్లలో ఒకే హద్దులు కనపరుస్తూ రిజిస్టర్ చేసుకున్నారన్నారు. మిగిలిన భూమిని హక్కుదారురాలైన కోనేటి సులోచన వద్ద 2023లో గాలిపూర్ణానంద చౌదరి, గుండ్లూరి నారాయణరెడ్డి తదితరులు రిజిస్టర్డ్ విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకున్నామని పేర్కొన్నారు. భూమికి రక్షణగా ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రహరీగోడ నిర్మాణసమయంలో గోపాల్నాయుడు, భూ విక్రయదారుడు మార్పూరి వెంకటేశులు...కోనేటి సులోచనకు తాము భూమి విక్రయించలేదని, అప్పటి డీఎస్పీ కేశప్పతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, తమపై స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఐజీకి ఫిర్యాదుచేశారన్నారు. దీంతో ఏపీ సీఐడీ అధికారులు కేసు విచారించి, డాక్యుమెంట్లోని,వేలిముద్రలు మార్పూరి వెంకటేశులుదేనని ధృవీకరించారన్నారు. అయితే తమ ప్రత్యర్థులు తమకున్న రాజకీయ పలుకుబడితో నివేదిక బయటకు రానీవకుండా ఏడాదిపాటు అడ్డుకున్నారన్నారు. 2024లో అప్పటి స్టాంప్స్ ఐజీ నివేదిక ఆధారంగా భూమిని రిజిస్టర్ చేసి, ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఫిర్యాదుచేసినందుకు మార్పూరి వెంకటేశ్పై ప్రభుత్వం తరపున కేసు పెట్టాల్సిందిగా పులివెందుల, పాకాల సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారన్నారు. దీనిపై ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదుచేశారన్నారు. తర్వాత ఈ భూమికి సంబంధించి మదనపల్లె ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓఎస్.నెం.354/2026 దాఖలు చేస్తే , తమ స్వాధీనంలో ఉన్న భూమిపై జోక్యం చేసుకోకుండా ప్రతివాదులను ఆదేశిస్తూ కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ మంజూరు చేసిందన్నారు. ఆ ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా ప్రత్యర్థులు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారన్నారు. గురువారం ఉదయం జేసీబీ వాహనాన్ని తీసుకువచ్చి బి.రెడ్డిగోపాల్ నాయుడు తదితరులు ప్రహరీగోడను కూల్చివేసి భూమిలోకి ప్రవేశించారన్నారు. తాము అడ్డుకునేందుకు ప్రయత్నించి, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెపుతున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యంచేసుకుని, చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయంపై తాలూకా పోలీస్స్టేషన్న్లో సీఐకు ఫిర్యాదుచేశామని, శుక్రవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిసి తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలతో సహా వివరించి న్యాయం కోరుతామన్నారు.


