గాలివీడు : తూముకుంట సోలార్లో ఇలియాస్ సోలార్ కంపెనీలో ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టని వైనంగా మారింది. కంపెనీ ప్రముఖులు చోరీలకు పాల్పడి ఏమీ తెలియని గిరిజనులపై నెపం నెట్టి విధులు నుంచి తొలగించిన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాష్నగర్కు చెందిన గిరిజనులు వలస వెళ్లకుండా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో కంపెనీలోని పెద్దలు, అధికారులు చేతివాటం ప్రదర్శించి అక్కడ విలువైన వస్తువులు చోరీకి పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవాలను పక్కనపెట్టి చిరు ఉద్యోగం చేసుకుంటున్న తమపై నెపం నెట్టి ఉద్యోగాల నుంచి తొలగించడం ఏమిటని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్కే రామానాయక్, బుక్కే రూపేష్ నాయక్, మూడే లోకేష్ నాయక్, మూడే పవన్ కుమార్ నాయక్, బి రామాంజనేయులు తదితరులను విధులనుంచి తొలగించారని, కంపెనీలో బాధ్యత గల ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలియజేస్తున్నారు.
గిరిజనుల ఆవేదన
ఉద్యోగ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఎవరో చేసిన చోరీ సంఘటన మాపైన నెట్టి అన్యాయంగా విధుల నుంచి తొలగించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
– రూపేష్ నాయక్, ప్రకాష్ నగర్ కాలనీ
ఇలియాస్ కంపెనీలో హెచ్ఆర్ను పోలీసులు విచారిస్తే చోరీ విషయాలు బయటకు వస్తాయి. నీతి, నిజాయితీగా చిరు ఉద్యోగం చేసుకుంటున్నా మాపై చోరీ నెపం నెట్టడం బాధాకరం. సోలార్ అధికారులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. – ఎం.లోకేష్ నాయక్, ప్రకాష్ నగర్ కాలనీ


