మదనపల్లె టౌన్ : ఎలాంటి తప్పు చేయక పోయినా, అన్యాయంగా తనపై దొంగతనం నింద మోపారన్న బాధతో ఓ యువకుడు ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం పుంగనూరు మండలంలో జరిగిన ఘటనపై బాదితుని కుటుంబీకులు తెలిపిన వివారాలు.. మండలంలోని నేతిగుట్లపల్లి పంచాయితీ, దిగువ కొండమీద పల్లెకు చెందిన జానకిరామ్ కుమారుడు ఎన్. హరీష్ (27) బాడుగ ఆటో నడుపుకొని భార్యనాగరత్న, కుమారునితో పాటు తల్లి దండ్రులను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన భార్య నాగరత్న బంధువు ఒకరు హరీష్పై సిమెంట్ దొంగలించాడని నింద మోపడంతో గ్రామంలో హేళన చేస్తున్నారని, తలెత్తుకు తిరుగులేక తీవ్ర అవమానంగా భావించాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా దొంగతనం నింద మోపారని ఆవేదనకు లోనై, ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


