సాక్షి, మదనపల్లె : తీవ్రమైన ఎల్నినో వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు లేక మదనపల్లె మండలంలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్, హెడ్ కె.మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే, అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల బృందం మదనపల్లె మండలంలోని మిట్టపల్లి, జంగంపల్లి, కొత్తవారిపల్లి, దయ్యాలవారిపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎండిపోతున్న పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావం వల్ల వేరుశనగ పంట అస్సలు పెరగకుండా ఎండిపోయిందని, అంతర పంటలైన అలసంద, అనుములు కూడా వాడిపోయాయని గుర్తించారు. చివరకు బోర్ల కింద నీరు తగ్గిపోవడంతో సూపర్ నేపియర్, జొన్న లాంటి పశుగ్రాస పంటలు సైతం నిలువునా ఎండిపోతున్నాయన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొద్దిపాటి నీటి వసతి ఉన్న కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటల్లో పంట వ్యర్థాలు, ఎండి రాలిన ఆకులు, చిరుకొమ్మలతో నేలపై ’మల్చింగ్’ (కప్పి ఉంచడం) చేసుకోవాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులంతా తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ శాంతి ప్రియ, డాక్టర్ పి.నాగమణి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలన


