– పురుగులు బయటికి వస్తున్నాయని స్థానికుల ఆందోళన
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చురీలో ఉన్న గుర్తు తెలియని రెండు మృతదేహాలు గత 10 రోజులుగా అలాగే ఉన్నాయని, వాటి నుంచి పురుగులు బయటకు వస్తూ తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు మంగళవారం ఉదయం ఆరోపించారు. బంధువులు ఎవరూ వచ్చి మృతదేహాలను తీసుకెళ్లకపోవడంతో అవి కుళ్లిపోయాయని, ఇప్పుడు శవాలను తొలిచే పురుగులు బయటకు వస్తున్నాయని స్థానికంగా కాపురముంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా మృతదేహాలు కుళ్లిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మృతదేహాలను తరలించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూరింటెండెంట్ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
కరాటే పోటీల్లో ప్రతిభ
మదనపల్లె సిటీ : విజయవాడలో జరిగిన 23వ ఏపీ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మదనపల్లె విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కటా, కుమితే, జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇలాహ్ బంగారు పతకం, తహ రెండు కాంస్య పతకాలు, సాత్విక బంగారు, వెండి పతకాలు, లైకర్ వెండి, కాంస్య పతకాలు, సాధ్వి వెండి పతకం, నైతిక్ కాంస్య పతకం సాధించినట్లు కరాటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. వీరిని కరాటే మాస్టర్ ఖాదర్బాషా, ఉపాధ్యాయులు అభినందించారు.


