పెద్దమండ్యం : వ్యవసాయబోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. మండలంలోని కోటకాడపల్లె పంచాయతీ తాటిమాకులపల్లె, పెద్దమండ్యం పంచాయతీ బిక్కావాండ్లపల్లె, చెరువుకిందపల్లెలకు సమీపంలోని వ్యవసాయబోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ జరిగిన విషయం తెలిసిందే. వ్యవసాయబోర్లకు సమీపంలో బిక్కావాండ్లపల్లె వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆంప్లిఫైర్లు, రెండు మైకులు, హుండీ చోరీ జరిగాయి. ఈ మేరకు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం వాహనాల తనిఖీ చేపడుతుండగా ద్విచక్రవాహనంలో వెళుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు మదనపల్లె మండలం బికె పల్లె కాలనీకి చెందిన ఆవుల రాజు (30), కావడి బాలరాజు (25), కోనేటి వెంకటేశు (43)గా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి కేబుల్ వైరు, ఆంప్లిఫైర్, రెండు మైక్లు, ఖాళీ హుండీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 19 వ్యవసాయబోర్ల వద్ద వీరు కేబుల్ వైరు చోరీ చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ బోర్లు, పొలాల వద్ద అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే రైతులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


