పులివెందుల రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ అర్హులకు కొత్త పింఛన్లకు మోక్షం కలగడం లేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులైన వారు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలోని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లు ఇంకా ఇవ్వడంలేదని అధికారులు చెబుతుండటంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. రేషన్కార్డుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తుల పక్రియ నిరంతరంగా కొనసాగేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ వెబ్సైట్ తెరవకుండా కాలయాపన చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హులు, కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకుని కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హులందరూ ఎదురుచూస్తున్నారు.
50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ సారూ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో
60 ఏళ్లు పైబడిన వారికి, ఒంటరి మహిళలకు, వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాని ప్రభుత్వం చెప్పింది. దీంతో పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు తీసుకుని సచివాలయాలకు పరుగులు పెట్టారు. సిబ్బంది మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, పింఛన్ల సైట్ ఓపెన్ కావడంలేదని చెబుతుండటంతో నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.
జగనన్న ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ :
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు వలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటివద్దకే వచ్చి అర్హులను గుర్తించి వారికి దరఖాస్తు చేసి పింఛన్లు, రేషన్కార్డులు ఇచ్చే సౌకర్యం అందుబాటులో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు, రేషన్కార్డులకు దరఖాస్తుకు అవకాశాలు ఇవ్వకపోవడంతో అర్హులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో తెరుచుకోని వెబ్సైట్
సచివాలయాల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు


