మదనపల్లె టౌన్ : ఆటో కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్న మహిళను బొలెరో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాత్రి మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లికి చెందిన పార్వతమ్మ సొంత పనిపై మదనపల్లెకు వచ్చింది. పని ముగించుకుని వలసపల్లి నవోదయ ఆర్చి వద్ద దిగి ఆటో కోసం వేచి ఉండగా బొలెరో ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో కాళ్లు రెండు విరిగి తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని 108 సిబ్బంది చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్ల సలహా పై వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు.
మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లిలో చోటు చేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసివారిపల్లి పంచాయతీ దిగువ ముట్రవారిపల్లికి చెందిన రామలింగారెడ్డి తన కుమార్తె అములును బెంగుళూరులో వదిలేందుకు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్కు బైకులో బయలుదేరాడు. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట వద్దకు రాగానే ఆటో వెనక నుంచి వచ్చి బైక్ను ఢీ కొట్టింది. రామలింగారెడ్డి, అతని కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం రామలింగారెడ్డిని తిరుపతికి రెఫర్ చేశారు.
మదనపల్లె టౌన్ : వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన అనిత (27)ను కుటుంబ విషయమై అత్త మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఫ రామారావుకాలనీకి చెందిన విష్ణుప్రియ (21) కుటుంబ సమస్యలతో ఆదివారం ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండోపట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పీలేరు రూరల్ : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ చిన్నగాండ్లపల్లెలో చింతచెట్ల నరికివేతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాధితుడు జి.వి. రమణ అన్నారు. ఆదివారం ఆయన స్థానికి విలేకరులతో మాట్లాడుతూ చిన్నగాండ్లపల్లెలో తమకు చెందిన చింత చెట్లను అదే గ్రామానికి చెందిన వారు ఉద్దేశపూర్వకంగా నరికివేయడం జరిగిందని తెలిపారు. చింతచెట్లను నరకడంతో పాటు కుల వివక్షత చూపినట్లు గత నెల 31న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసి రెండు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తాము ఇచ్చి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.


