వాల్మీకిపురం : జాతీయ జట్టులో రాణించే విధంగా మహిళా క్రీడాకారిణులు నైపుణ్యాలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్జోన్ అండర్ 23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలను ఆయన సందర్శించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్డే టోర్నమెంట్కు హాజరైన చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లా మహిళా క్రికెటర్లను ఉద్ధేశించి డిఈవో మాట్లాడుతూ చదువుతో పాటు యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు సైతం తమ నైపుణ్యాలను పెంచుకుంటే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చునన్నారు. కార్యక్రమంలో హెడ్కోచ్ సునీల్, సీడీసీఏ ఉపాధ్యక్షులు శ్రీధర్, సీడీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి, సెక్రటరీ సతీష్యాదవ్, సునీల్, హర్ష, కిషోర్, గోపి, భాస్కర్రెడ్డి, మనోజ్, మౌళి, నాగరాజు, నరేష్, మురళీ, పవన్, భరత్, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి దుర్మరణం
మదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా తలుపుల గ్రామం సిద్దగురుపల్లికి చెందిన వీరాంజనేయులు(33) భార్య మల్లీశ్వరితో కలిసి బి.కొత్తకోటలో నివసిస్తూ, స్థానిక పాల డైరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన బైక్పై పిటీఎం రోడ్డులో వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయులు అకాల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


