మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఏటీఎంను అపహరించిన దొంగల ముఠా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్డు శివాజీ నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటిఎం యంత్రాన్ని చోరీ చేసిన ముఠా హర్యానాకు చెందినదిగా అనుమానిస్తున్నామని తెలిపారు.
ఏటిఎం దొంగల మొదటి దొంగతనం బైక్
అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన దొంగలు జిల్లా అంతటా అన్వేషణ చేసినట్లు తెలుస్తోందన్నారు. దొంగల అన్వేషణ ఎంత కాలం నుంచి సాగుతుందో తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మదనపల్లిలోనూ పక్కా రెక్కీ నిర్వహించిన తర్వాతనే పథకం ప్రకారం ఈ దొంగతనం జరిగినట్లు అనుమానిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రెక్కి కోసం వెళ్లిన దొంగల ముఠా మొదటి కేవి పల్లిలో బైక్ను దొంగలించిందన్నారు. ఆ తరవాత బొలెరో వెంట బైక్పై దొంగల ముఠా పీలేరు, కందూర్, నిమ్మనపల్లె మీదుగా మదనపల్లెకు చేరుకుని ముందే వేసుకున్న పథకం ప్రకారం మదనపల్లెలో ఏటిఎం చోరీ చేశారన్నారు.
ముందే దొంగలించిన బొలెరోలో పరారీ
కందూరు నుంచి నిమ్మనపల్లికి వచ్చిన దొంగలు వశిష్ఠ స్కూల్ వద్ద సీసీ కెమెరాలో కనిపించారు. బైపాస్ నుంచి ఇసుకనూతిపల్లెకు వచ్చి, ఆ తరవాత బొలెరోలో సీటీఎం రోడ్డుకు చేరుకుని, రాత్రి గస్తీ పోలీసులు వెళ్లిన తరవాత దొంగలు ఏటిఎం చోరీ చేసినట్లు చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. ఏటిఎం అపహరించిన అనంతరం వాల్మీకిపురం రోడ్డు మీదుగా వెళ్లి, తిరిగి నిమ్మనపల్లి మండలానికి చేరుకుని అక్కడ ఏటిఎంను ధ్వంసం చేసినట్లు నిర్ధారించామన్నారు. కెవిపల్లిలో దొంగలించిన బైక్ ను కూడా నిమ్మనపల్లెలోనే వదిలేసిన దొంగలు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు పారిపోయారు.
5 ప్రత్యేక బృందాలు
దొంగలను పట్టుకోవడానికి నిష్టాతులైన 5 ప్రత్యేక పోలీసు బృందాలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చోరీలో ఐదుగురు
ఏటిఎంను దొంగలించిన ముఠాలో ఐదుగురు ఉన్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి రోడ్లపై నాకాబందీ తనిఖీలు ముమ్మరం చేయడంతో దొంగలు రూట్ మార్చినట్లు చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు
ప్రతి సీసీటీవి ఫుటేజ్ను పరిశీలించడంతోపాటు అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలుకుని దొంగలు రూటు మార్చి ఏమార్చినట్లు తెలిపారు. టెక్నికల్ ఆధారాలతో దొంగల కదలికలను ట్రాక్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే సెల్ఫోన్ల డంప్ తీసి ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
సవాల్గా స్వీకరించాం
మదనపల్లి ఏటిఎం చోరీ కేసును సవాల్గా తీసుకున్నామని, చురుకై న బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. పారిపోయిన నిందితులు ఎయిర్ పోర్టుల్లో ఉన్నట్లు తెలసుకుని అక్కడికి రెండు బృందాలు వెళ్లాయని, అనుమానితుల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
రంగంలోకి పోలీస్ ప్రత్యేక బృందాలు
త్వరలోనే పట్టుకుంటాం : ఎస్పీ ధీరజ్


