● అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం
● నిందితుడి అరెస్ట్
ములకలచెరువు : అనుమానం పెను భూతంగా మారడంతో.. భర్తనే భార్యను హత్య చేశాడు. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భావించి, అతిగా మద్యం తాగి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లె సమీపంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు భర్తే అనే తేల్చారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐ దస్తగిరి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీటీయం మండలం మల్లెల ఎస్సీ కాలనీకి చెందిన సురేష్(34)కు బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన రమాదేవి(28)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మూడేళ్లగా రమాదేవి ప్రవర్తనలో మార్పు వచ్చి వేళాపాళా లేకుండా మోబైల్లో మల్లెలకు చెందిన నరేష్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా.. గమనించిన భర్త పలుమార్లు మందలించాడు. రమాదేవి భర్త సురేష్తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి సంసారం చేసుకునేలా చేశారు. అనంతరం రాపూరివాండ్లపల్లెకు చెందిన ప్రతాప్రెడ్డి కొబ్బరితోటలో ఇద్దరూ పనిలో చేరి అక్కడే ఉండేవారు. గత గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన సురేష్ సహించలేక భార్య రమాదేవిని హత్య చేయాలని భావించి, కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి గోడకు తల బాదాడు. కేకలు వేస్తుండగా తాడును మెడకు బిగుతుగా చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి పారిపోయాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని రంగసముద్రం జెడ్పీ హైస్కూల్ వద్ద అరెస్టు చేశారు. విచారణ చేసిన అనంతరం అతన్ని ములకలచెరువు సర్కిల్ కార్యాలయంలో అరెస్టు చూపించారు. తంబళ్లపల్లె కోర్టుకు నిందితుడిని తరలించగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు. ఈ కేసును ఛేదించిన సీఐ దస్తగిరి, ఎస్ఐలు పరమేష్నాయక్, ఉమామహేశ్వర్రెడ్డి, సిబ్బంది శంకర్నాయక్, వెంకటేష్, ఖదీర్, బావాజాన్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ చెప్పారు.


